శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత
మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవితమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.
మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభముని తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలివనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.
ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము "18" సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
కాళికాదేవి యొక్క కరములు - 18 అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది.
భారతయుద్ధము జరిగిన దినములు - 18 కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.
కురుపితామహుడు అంపశయ్యమీదనున్న దిననములు - 18
పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైన ఉన్నది 18 దినములు.
భారత యుద్ధములో పాల్గొన్న అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది. అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది.